- టార్గెట్ల పేరుతో కంపెనీ వేధింపులే కారణమని తోటి ఉద్యోగుల ఆందోళన
ఎల్బీనగర్, వెలుగు : ఓ ఫార్మా కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్న యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు టార్గెట్ల పేరుతో కంపెనీ వేధింపులే కారణమని తోటి ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన హైదరాబాద్ ఎల్బీనగర్ పీఎస్ పరిధిలోని బైరామల్గూడలో గురువారం జరిగింది.
మృతుడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్గొండ జిల్లా దేవరకొండ మండలం తాటికోల్ గ్రామానికి చెందిన జూలూరు అఖిలేశ్ (22) గుజరాత్కు చెందిన ఓ ఫార్మా కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తూ... ఎల్బీనగర్ బైరామల్గూడలో తన స్నేహితుడితో కలిసి అద్దె గదిలో ఉంటున్నాడు. గురువారం ఉదయం అఖిలేశ్ మామ మల్లేశ్ ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో అతడు అఖిలేశ్ ఉంటున్న గది వద్దకు వచ్చాడు. లోపలి నుంచి గడియ పెట్టి ఉండడం, ఎంతసేపు డోర్ కొట్టినా ఎవరూ తీయకపోవడంతో అతడు తన సోదరుడు హరీశ్కు ఫోన్ చేయగా.. అతడు కూడా వచ్చాడు. ఇద్దరూ కలిసి డోర్ను బలవంతంగా ఓపన్ చేసి చూడగా... అఖిలేశ్ కిటికీ గ్రిల్స్కు ఉరి వేసుకొని కనిపించాడు.
ఇద్దరూ కలిసి అతడిని దింపి చూడగా.. అప్పటికే చనిపోయాడు. మల్లేశ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా టార్గెట్ల పేరుతో సేల్స్ మేనేజర్స్, ఇతర ఉన్నతాధికారుల ఒత్తిడి వల్లే అఖిలేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని తోటి ఉద్యోగులు పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. అఖిలేశ్ ఇతర కంపెనీలోకి ఇంటర్వ్యూకు వెళ్లిన విషయాన్ని తెలుసుకున్న ఉన్నతాధికారులు అతడికి వార్నింగ్ ఇచ్చారని, ఏ కంపెనీలో కూడా పనిచేయకుండా చేస్తామని బెదిరించారని ఆరోపించారు. అఖిలేశ్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారికి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు
